Tuesday, October 28, 2014

సిరిగల్ల భారతదేశం .. తాకట్టు పెట్టబడ్డది ....... Article - 44

సిరిగల్ల భారతదేశం .. తాకట్టు పెట్టబడ్డది

పేరుకేమో  పోటి  ప్రపంచం .. నడిచేది దొంగల  రాజ్యం
నోటికాడ  కూడా  లాగి... డబ్బున్నోడికి  తినబెడతారు

స్వత్చ భరత్ నినాదాలు .. చిపురుతో ఫోటోలకు ఫొసులు
పురపాలక  కార్మికులకి .. రెక్కాడితే డొక్కాడదు , జీతాలు సమయానికి ఇవ్వరు

నల్ల  ధనము బయటకి  లగుతామని వాగ్దానాలు .. పేర్లు  బయట  పెట్టోదని అసోచం (పారిశ్రామికవేత్తల సమాఖ్య)
దాగుడుమూతలు  ఆడుతున్నార .. దేశ భవిష్యత్ బాగుపడున

అభివృద్ధి  మా  లక్ష్యమని  ..ప్రగల్బాలు పలికినారు
పెట్టుబడిదారులకు  అభివృద్ధి .. సామాన్య ప్రజల  నెత్తిన  ధరల  మోతలు

మతతత్వపు  రాజకీయాలు , ప్రాంతీయ  వైషమ్యాలు
ప్రజల  ఆలోచన  మరల్చటానికి .. పదవులు  నిలుపుకొనుటకు

విదేశి  ప్రత్యక్ష  పెట్టుబడులంటూ  పరదేశాలని  ఆహ్వానించిరి
మన  సంపాదన  మన  దేశ అభ్యున్నతికి  కాకా  .. పరదేశం పాలు కాకతప్పదు

చాపకింద  నీరు  లాగా  .. తెర వెనక  భాగవతం  జరుగుతూ  ఉంది
ఇప్పటికైనా  కళ్ళు  తెరవర .. లేకుంటే  బానిస  బ్రతుకే.

Wednesday, October 8, 2014

ఇదేనా..! ప్రజాస్వామ్యం ....... Article - 43

ప్రజాస్వామ్య దేశం ...

డబ్బులు పారేసి సీట్ కొనుక్కుని యమ్.పి. నో , ఎమ్.ఎల్.ఎ. నో అయ్యి కొన్నివేల కోట్లు మింగేస్తారు...ఇది​
మన ప్రజాస్వామ్యం ...

వెయ్యమంది పొట్టగొట్టి పదిమందికి ఉపాది కల్పించి, అసలు పెట్టుబడిదారులు లేకపోతే ఉపాది ఎవరు కల్పిస్తారు అని ప్రశ్నించే వారున్న ఈ దేశం ... ప్రజాస్వామ్య దేశం ...

మన రూపాయి విలువ పెరగకపోయినా పెట్టుబడిదారులు లేకపోతే అభివృద్ధి లేదు అని ఆరాటపడే వాళ్ళున్న ఈ దేశం ప్రజాస్వామ్య దేశం..

మా దేశం లో పెట్టుబడులు పెట్టండి మా దేశ ప్రజల పొట్టగొట్టి మీకు లాభాలు ఇస్తాం, లాభాల్లో కమీషన్లు మాకివ్వండి , దానికి అభివృద్ధి అని పేరు పెట్టి మా ప్రజలను మభ్య పెడతాం ...ఇది మన ప్రజాస్వామ్యం...

ప్రభుత్వ సంస్థలు దివాలా తీయిస్తారు - ప్రైవేటు సంస్థలకు రాయతీలిస్తారు ..ఇది మన ప్రజాస్వామ్యం ...
చిరు వ్యాపారులకు చేయుతనివ్వక దయనీయ పరిస్థితి - బడా వ్యాపారులకు బాగా చెయ్యందించి పైకి లాగుతారు ..ఇది మన ప్రజాస్వామ్యం ..

దేశ అభ్యునతి కోసం స్వదేశి వస్తువులనే వాడాలని హితబోదలు చేస్తారు కాని అధిక సేతం విదేశి వస్తువులనే విక్రయిస్తారు .. ఇది మన ప్రజాస్వామ్యం.​

ఇంటికో ఉద్యోగం పేరుతో రైతుల పొలాలను తక్కువ ధరకు కొనుక్కుని , కనీసం 10% కూడా ఉద్యోగాలివ్వని వైనం ...ఇది ​​మన ప్రజాస్వామ్యం ...​

సెజ్ లు పెడతాం - నిరుద్యోగం నిర్మూలిస్తాం, ఇంటికో ఉద్యోగం అని ఆశ చూపి రైతుల భూములు తక్కువ ధరకు కొనుక్కుని , ఇంటికో ఉద్యోగం కాదుకదా , పైగా ఆ సెజ్ల వల్ల ఊరు కనుమరుగైన వైనం ...ఇది మన ప్రజాస్వామ్యం.


Thursday, August 28, 2014

దగా పడ్డ తెలుగు గడ్డ .......Article-42

మాతృభాషని తల్లితో పోలుస్తారు
భాష ఒక్కటైతే సరిపోద్దా..!
నా బతకమ్మకి - నీ అట్లతద్దికి పోలికేక్కడిది అంటే 
భాష ముందు పుట్టింద లేక బతకమ్మ, అట్లతద్ది లు ముందు పుట్టాయ.
ఇదెట్ల ఉందంటే తాళి కట్టిన ఆలి కోసం కన్న తల్లిని కొట్టి ఇంట్లో నుంచి తరిమినట్లు ఉంది.

ఇక యాస గురించి - నీ యాస నా యాస ఒక్కటి కాద..!
తెలంగాణాలో రెండు యాసలు ఉత్తర తెలంగాణా , దక్షిణ తెలంగాణా.
ఆంధ్ర లో శ్రీకాకుళం జిల్లాది ఒక యాస, విజయనగరం-విశాకపట్నం ది ఒక యాస,
తూర్పు గోదావరి - పశ్చిమ గోదావరి జిల్లాలది ఒక యాస, కృష్ణ-గుంటూరు లది ఒక యాస, నెల్లూరు-ప్రకాశంలది ఒక యాస,  
రాయలసీమది ఒక యాస.
ఇలా అయితే యాసకో రాష్ట్రము పుట్టాలి .

ఇంకొకడు నీ యాస కన్నా నా యాస స్వచ్ఛమైనది, స్పష్టమైనది అంటారు. భాష కనుగున్నది భావాన్ని వ్యక్తపరచటానికేకాని యాసల పేరుతో ఒకరి గౌరవాన్ని ఒకరు దిగజార్చుకోవటానికి కాదు. 
యాస మారినంత మాత్రాన తెలుగు భాష లో అచ్చులు హల్లులు మారవు.

ఈ మధ్య సోషల్ మీడియా లో చాసాను- తెలంగాణా విద్యార్ధి గురించి "ఐ. ఐ. టి. లో రాణించిన తెలుగు తేజాలు " అని ఈనాడు దిన పత్రికలో వేసారు . దానికి తెలంగాణా సోదరులు ఇంకా తెలుగు తేజాలు అని ఎన్నాళ్ళు మభ్యపెదతారు ఇతర రాష్ట్రాల వారిని రాష్ట్రాల పేరుతో సంబోదించారు మమ్మల్ని కూడా తెలంగాణా తేజాలు అని సంబోదించండి అని అన్నారు. మరి ఆ విషయాన్ని వారి అవివేకనికే వదిలేయాలి .

తెలుగు భాషతో ఉర్దూ భాష కలిస్తే తెలంగాణా అయ్యిందా..!
నిజాం దాదాపు 224 సంవత్సరాలు తెలంగాణా ని తన నిరంకుసత్వ పాలనలో పరిపాలించి తమ ఉర్దూ భాషనూ ప్రజలపై రుద్దుతే వచ్చింది తెలంగాణా యాస..

నిజాం పరిపాలనలో కృష్ణ జిల్లా లోని కొండపల్లి పేరు ముస్తఫాబాద్ , శ్రీకాకుళం జిల్లా పేరు గుల్శానాబాద్ .
నిజాం పెట్టిన పేర్లు ఇక్కడ మారాయి గాని. తెలంగాణా లో మాత్రం అలానే ఉన్నాయి .

బమ్మెర పోతనకు తెలియదు తను తెలంగాణా అంటే ఏమిటో , తెలంగాణా యాసంటే ఏమిటో ... అందుకే ఆంధ్ర మహా భాగవతము అచ్చ తెలుగులో రచించాడు .
రాణి రుద్రమ్మకి తెలియదు తను పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యం అంటే కేవలం తెలంగాణా వరకే అని .

ఆంధ్ర అనే పదం వాల్మీకి రామాయణం లో రాముడు కాలుమోపిన ప్రాంతం భద్రాచలం అని సంబోదించబడి ఉంది .
 నిజాం తన నిరంకుసత్వ పాలన కొనసాగించటం కోసం బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని మనల్ని ప్రాంతాలుగా విభజిస్తే - మనం ప్రాంత విభేదాలతో మానసికంగా దూరమవుతున్నాము. అలా నిజాం, బ్రిటిష్ చేతుల్లో దగాపడ్డం - ఇప్పుడు నిజాన్ని, వాస్తవాలను పక్కన పెట్టి  మనల్ని మనమే దగా చేసుకుంటున్నాం.
అసలు నువ్వు నేను కలిసున్నట్టు చరిత్ర లోనే లేదని కొందరు మతిస్థిమితం తప్పి వితండవాదం చేస్తున్నారు. కలిసి లేకపోతే భాష ఒక్కటి ఎలా అవుతుంది - హిందీ , కన్నడ, తమిళ్ , మలయాళం వాళ్ళ లాగా భాష కూడా వేరుగా ఉండేది .
నాయకులు, ప్రభుత్వాలు చేసిన తప్పులకి మనం మాటల తూటాలతో సంఘర్షించుకుంటున్నాము.
కుల గజ్జి, మత పిచ్చి లాగా ఈ ప్రాంత వైషమ్యాలు చలరేగుతున్నాయి . జనం కొట్టుకుంటుంటే వేడుకలు చూడటం రాజకీయ నాయకుల నైజం.
ఒకప్పుడు హైదరాబాద్ వస్తే ఏ ఊరు అని అడిగే వారు. ఇప్పుడు ఆంధ్ర నా, తెలంగాణా నా అని అడుగుతున్నారు.
సీమాంద్ర అని విమర్సిస్తారే  - ఇక్కడ ప్రజలలో సామాన్యులు లేరా... ఇక్కడ అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకునే రైతులు లేరా .. రోజుకి కనీసం ఒక్కపూటైన అయిదు వేళ్ళు నోట్లోకి వెళ్ళలేని దుర్భరమైన పరిస్థితులలో ఉన్న ప్రజలు ఇక్కడ లేరా .. ఎందుకుండరు అవినీతి, అక్రమాలు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే నాయకులకు ప్రజలు తలాడించినంత కాలం ఈ దేశానికీ ఈ దుర్గతి తప్పదు.

దేశం మొత్తం బ్రిటిష్ ముష్కరులను తరిమికొట్టేందుకు ఉద్యమాలు చేసే సమయంలో తెలంగాణా లో నిజాం నిరంకుసత్వ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి.
ఈ రెండు ఉద్యమాల నేపధ్యం ఒకటి కాదు. ఒకటి బ్రిటిష్ ముష్కరులపైన మరొకటి నిజాం నిరంకుసత్వ పాలనపైన.

రాష్ట్రాలు గా విడిపోయిన తెలంగాణా - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మధ్య అంతర్యం ఇంకా తరగలేదు. ఇప్పటికైనా ఈ పరోక్ష వాదనలు మాని సమస్యలపై  సంఘటిత పోరాటం చేయవలసిన ఆవశ్యకత ప్రజలకు ఉంది.
సీమాంద్ర తెలంగాణా గొడవలు సమసిపోవాలి.... ఈ మాటల యుద్దాలు ఆగిపోవాలి..

కొంతమంది మాది ప్రత్యేక దేశం అంటుంటారు...
బ్రిటిష్ మన దేశం లో అడుగుపెట్టక ముందు మన దేశం లో రాచరికపు వ్యవస్థ ఉండేది , ఆ సమయంలో  ప్రతి ప్రాంతము ఒక దేశం (రాజ్యం) గానే ఉండేది. మౌర్యులు , కళింగులు, శాతవాహనులు , చోళులు ,పాండ్యులు , తుళువులు, తూర్పు చాణిక్యలు, కాకతీయులు , మొగలులు ఇలా ఎందరో మన దేశం లోని ప్రాంతాలను దేశాలుగా పరిపాలించారు. బ్రిటిష్ ముష్కరులు మన దేశం లో అడుగుపెట్టిన తర్వాత లొంగని రాజ్యాలను దురాక్రమణలతో జయించి, లొంగిన రాజ్యాలతో ఒప్పందాలు చేసుకుని, మన దేశం లో అనేక రాజ్యాలను హస్తగతం చేసుకుని పరిపాలించారు.  

భారత దేశానికీ బ్రిటిష్ స్వతంత్రం ప్రకటించాక 7 ప్రాంతాలు రాచరిక పాలనలోనే ఉండేవి...
ఆ ఆరు ప్రాంతాలు బ్రిటిష్ ముష్కరులతో సత్ సంబందాల కోసం బ్రిటిష్ వారికీ శిస్తులు కడుతూ , బ్రిటిష్ వారి అవసరాలు తీర్చేవిగా ఉన్నాయి కబ్బట్టే ఇంకా ఆ ప్రాంతాలు రాచరిక వ్యవస్తలో ఉన్నాయి.

ఆ ఏడు ప్రాంతాలు జమ్మూ & కాశ్మీర్, మైసూరు ,హైదరాబాద్ , బరోడా , ట్రావన్కోర్ ,కొచ్చిన్, సిక్కిం. 
మనకి స్వతంత్రం వచ్చేనాటికి అంటే 15 ఆగష్టు 1947 నాటికి ఇవి ప్రత్యేకమైన దేశాలు.

కాని తర్వాత జమ్మూ & కాశ్మీర్ 26 అక్టోబర్ 1947 న భారత దేశం లో విలీనమైంది.
మైసూరు భారతదేశానికి స్వతంత్రం ప్రకటించే 5 రోజుల ముందు,  9 ఆగష్టు 1947 న భారత దేశం లో విలీనమైంది.
హైదరాబాద్ ను నిజాం పాకిస్తాన్ లో విలీనం చేయటానికి నిర్ణయం తీసుకున్న తరుణం లో 13 సెప్టెంబర్ 1948 న సర్దార్ వల్లభాయి పటేల్ ఆదేశం తో ఆపరేషన్ - పోలో పేరుతో భారత బలగాలు హైదరాబాద్ సంస్థానం లో అడుగుపెట్టినవి. 17 సెప్టెంబర్ 1948 న హైదరాబాద్ భారత దేశం లో విలీనం చేయబడి ఒక రాష్ట్రంగా ఏర్పడింది.
బరోడా 1 మే 1949 న భారతదేశం లో విలీనమైంది.
ట్రావన్కోర్ 1 జూలై 1949 న కొచ్చిన్ తో విలీనమై అతి స్వల్ప కలం లోనే భారతదేశం లో విలీనమైంది.
సిక్కిం 1975 వరకు సిక్కిం "చోగ్యాల్" రాజ వంశీకుల పాలనలో ఉండే ఒక స్వతంత్ర దేశము.1975లో ప్రజాతీర్పు (రిఫరెండం) ను అనుసరించి  భారతదేశంలో 22వ రాష్ట్రంగా 16 మే 1975 న విలీనమైంది.

Wednesday, August 20, 2014

నా విజయవాడ విజయాలకు వాడ.. అవుతుంది రాజధాని వాడ.......Article - 41


విజయవాడ రాజధాని అవుతుంది అంటే సంతోషంగానే వుంది కానీ..
విజయవాడ చుట్టూ ప్రక్కల ఉన్న పంట పొలాలు స్థలాలై సిమెంట్ భవంతులతో, కాంక్రీట్ మయమవుతాయేమొ.
ప్రకృతి పలకరింపు కనుమరుగు అవుతుందేమొ.
కాలుష్యపు కోరలు జడలు విప్పుతుందేమొ.
కాడేడ్లు కనుమరుగు అవుతాయేమొ.
పల్లె వాసాలు పట్నపు రంగుల తలుకు బెలుకులలో ఉక్కిరిబిక్కిరి అవుతాయేమొ.
మా ఊరి ప్రక్కన చిన్న అడివి, అప్పుడప్పుడు మా పోలల్లోకొచ్చి పలకరించే జంతువులు, పక్షులను ఇక జూ పార్క్ లలో చూడటమే నేమొ
పొలాల గట్లపై ఉండే తాడి చెట్లు ఇక ఉండవేమొ.
వెదురు కర్రతో తాయారు చేసే బుట్టలు ఇక కనపడవేమొ.
నీటి మడుగులు మటుమాయమవుతాయేమొ.
స్వచ్చమైన చెరువు నీటిని అభివృద్ధి పేరుతో కలుషితం చేసి బరించలేని వాసనలతో మురికి కూపాలుగా మారుస్తారేమో.
అందంగా కనిపించే పర్వతాల సోయగాలు హరించుకు పోతాయేమొ.
పేద , మధ్యతరగతి  బ్రతుకులు ఇంకా బారమవుతాయేమొ .
అభివృద్ధి ముసుగులో ఇంకా ఎన్నెన్ని అంతరించి పోతాయో...

Tuesday, August 19, 2014

మా తెలుగు తల్లి చిరునవ్వుల మాటున దాగిన గుండె వ్యధ.......Article-40



తెలుగు తల్లమ్మా.....
నీ పాలు తాగినోళ్లే ..నీ యాస మాదికాదు..
నీ యాసం మాదికాదు...నీ కట్టు మాదికాదని  నిన్ను తిట్టి తరిమేసారా.... 
నిన్ను స్మరించే నీ పాటను చించి.. అవమానించి... గనకార్యం చేసినట్టు ఆనందించారా...
భాష ఒక్కటైతే సరిపోతుందా భావమొక్కటి అవ్వాలని కోతలుకూసే వాడు మాట్లాడే భాష తల్లి తెలుగేనమ్మా.. 
తెలుగు అచ్చులారా-హల్లులారా విన్నారా ఈ వింత మీరంతా ఒక్కటి కాదంట...
తెలుగు తల్లంటా - తెలుగు జాతంటా - ఎవడికి తల్లి, ఎవడిదీ జాతి అంటూ నీ మాతృత్వపు మమకారాన్ని చులకన చేసి వెక్కిరించారా...
నీ ఉసురు తగిలి పోతారు - ఓ నువ్వలా ఎందుకు అనుకుంటావులే - తల్లివి కదా  "అన్నది నా బిడ్డలే కదా  అని క్షమించి వదిలేస్తావ్"
ఎంతైనా మాతృత్వపు మమకారం కద...

Wednesday, November 7, 2012

కులం.......Article-39

   కులం- వృత్తి కి ఇంకొక పేరు కులం..ప్రతి ఒక్కరు నిర్దిష్టమైన వృత్తి ని ఎంచుకోవటం వల్ల, ఆ నిర్దిష్టమైన వృత్తి కి ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ పేరే కులం. ఈ కులం సంవత్సరాలు గడిచేకొద్దీ చెట్టు ధృడంగా ఉండాలంటే వ్రేళ్ళు ఏ విధంగా అయితే భూమి లోపాలకి చొచ్చుకుని పోతాయో, అదే విధంగా ఈ కులం అనే ఒక పదం మనుషుల నరనరాల్లోకి జీర్నీంచుకుపోయి మనిషి మెదడును తొలిచే క్రిమి లా తయారైంది. తొండ ముదురితే ఊసరవెల్లి అవుతుంది అన్నట్టు...కులం అనే ఒక పదం అనేక సామజిక వర్గాలుగా విభజించబడింది. ఇంతటితో ఆగకుండా అగ్రకులాలు నిమ్న  కులలుగా విభజించబడి కుల వివక్షకు దారి తీసింది..

   స్వాతంత్రం వచ్చి 65 సం|| గడుస్తున్న నేటికి చంద్రశేఖర్ ఆజాద్ ని చూపిస్తే మన కులమేనా అని అడిగే చదువుకున్న కుల గజ్జి వ్యాధిగ్రస్తులు ఇంకా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రభోజుడుగా ప్రఖ్యాతిగాంచిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి  శ్రీ క్రిష్ణదేవరాయులు మా కులం అంటే మా కులం అంటూ సాక్షాదారాలతో వాదనలు చేసుకునే సంఘటనలు నేటికి ఇంకా జరుగుతున్నాయి అంటే ఆశ్చర్యపోవలసిన పనిలేదు. కచ్చితంగా నేటికి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి.

   ఒక వ్యక్తి తన గొప్ప వ్యక్తిత్వం వల్లో సక్రమమైన ఆలోచనల వల్లో, తన అకుంటిత కార్యాచరణ వల్లో కీర్తిని సముపార్జిస్తాడు.ఆ కీర్తి తన స్వార్జితం.అయితే అదే వ్యక్తి యొక్క సామజిక వర్గానికి చెందిన మిగిలిన వారు అతని వ్యక్తుత్వాన్ని అతని ఆలోచనలను, అతని కార్యాచరణను ఆదర్శంగా తీసుకుని అతనిలా ఎదగడం పై ద్రుష్టి పెట్టకుండా...అతను మా సామజిక వర్గం వాడే అని అంటే మా కులం వాడే అని పొగుడుతూ కాలం గడిపేస్తారు గాని వాళ్ళ వ్యక్తుత్వాల్ని, నడవడిని ఆదర్శంగా తీసుకుని మారడానికి ప్రయత్నించారు.

    సామజిక వర్గం(కులం) గురించి ఆలోచించలేదు కాబట్టే  అల్లూరి సీతారామరాజు  మన్యం వీరుడు అయ్యారు.సామజిక వర్గం(కులం) గురించి ఆలోచించలేదు కాబట్టే  సర్దార్  భగత్ సింగ్  భారతమాత గుండెల్లో నిలిచిపోయి అమరుడయ్యారు. సామజిక వర్గం(కులం) గురించి ఆలోచించలేదు కాబట్టే  చంద్రశేఖర్ ఆజాద్ మన భారత ఖండంలో చిరస్తాయిగా నిలిచిపోయారు. సామజిక వర్గం(కులం) గురించి ఆలోచించలేదు కాబట్టే పుచ్చలపల్లి  సుందరరామిరెడ్డి  పుచ్చలపల్లి సుందరయ్యగా జనం గుండెల్లో నిలిచిపోయారు .
  కులాన్ని గౌరవించటం మానేసి మనుషుల వ్యక్తుత్వాన్ని గౌరవించటం మొదలుపెట్టిన రోజున ఈ దేశం పురోగమిస్తుంది.


Saturday, October 27, 2012

పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కాని పేదవాడిగా చనిపోవడం మాత్రం నీ తప్పే.......Article-38


పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కాని పేదవాడిగా చనిపోవడం మాత్రం నీ తప్పే .
ఇది డబ్బు ఉన్నవాడు చెప్పే మాట. డబ్బుకు ప్రముఖ్యతిచ్చేవాడు చెప్పేమాట. డబ్బు కేవలం పేదవాడ్ని ధనికుడిగా చేస్తుంది తప్ప, గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాడ్ని చేయలేదు. డబ్బు కేవలం ఒకరి అవసరాలు తీర్చుకోవటానికి  మాత్రేమే ఉపయోగపడుతుంది కానీ గొప్ప వ్యక్తిత్వం పది మంది మేలు కోసం ఉపయోగ పడుతుంది. ప్రతి ధనికుడు గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు  కాదు, అలానే ప్రతి పేదవాడు చరిత్రహీనుడు కాదు. 
డబ్బు ఈ  రోజు నిన్ను సుఖపెడుతుంది రేపు నిన్ను బాధపెడుతుంది, ఈ రోజు నీతో ఉంటుంది రేపు నీ దగ్గర ఉండకపోవచ్చు, కాని గొప్ప వ్యక్తిత్వం జీవితాంతం నీ తోనే ఉంటుంది, నిన్ను నలుగురి ముందు గొప్పగా నిలబెడుతుంది  నీ మరణం తర్వాత కూడా జీవిస్తుంది. డబ్బు వల్ల నీకు దగ్గరయ్యేవాళ్ళ వల్ల నీకు మేలుకంటే కీడే ఎక్కువ జరగవచ్చు, కానీ మన వ్యక్తిత్వం వల్ల దగ్గరయ్యే వాళ్ళు మన చివరి శ్వాసవరకు మనతోనే ఉంటారు.
తన గురించే ఆలోచించమనేది డబ్బు...అందరి కోసం ఆలోచించమనేది గొప్ప వ్యక్తిత్వం. స్వార్ధం తో కూడుకునేది డబ్బు-సహాయం చేసే గుణం తో కుడుకునేది గొప్ప వ్యక్తిత్వం. డబ్బు 'నా' తో మొదలవుతుంది -గొప్ప వ్యక్తిత్వం 'మన' తో మొదలవుతుంది.
నువ్వు పుట్టినప్పుడు నీకేమి లేవు పోయేటప్పుడు ఏమి తీసుకుపోవు.నీకంటూ మిగిలేది నీ పేరు మాత్రమే. ఆ పేరు కేవలం అక్షరాల్లా మిగిలిపోకూడదు- ఒక చరిత్రగా మారాలి అంటే అది కేవలం ఉన్నతమైన వ్యక్తిత్వం వల్లే సాధ్యం -డబ్బు వల్ల కాదు.